కోదాడ నియోజకవర్గంలో యూరియా కోసం రైతుల ఆందోళన.. చిలుకూరు సహకార సంఘం వద్ద ఉద్రిక్తత
సూర్యాపేట సందేశం టైమ్స్ | కోదాడ | ఫిబ్రవరి 06
కాంగ్రెస్ ప్రజాపాలనలో యూరియా అందక కోదాడ నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ చిలుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఆందోళనకు దిగారు. యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేయగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు రైతులు పురుగు మందు డబ్బాలతో ధర్నా నిర్వహించగా, ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సహకార సంఘానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. టచ్ మొబైల్ ఫోన్లు ఉన్న రైతులే యాప్ ద్వారా యూరియాను ఆన్లైన్ చేసుకోగలుగుతున్నారని, డబ్బా సెల్ ఫోన్లు ఉన్న తమలాంటి రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.